Saturday, January 26, 2013

అర్జునుడు - XI

    అర్జున్ కి ఇప్పుడు అంతా అర్ధం అవుతోంది. తాను మొదట బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించడం, తర్వాత జరిగిన ఘోర విలయం, కన్యా కుబ్జం, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి బలి అవ్వడం అతనికి ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తోంది. ఇందాకా రాజ గురువు తన నుదుట విభూతి పూసినప్పుడు, ఇంకా మిగిలింది కూడా అర్ధం అయ్యింది తనకి. అసలు జరిగిందేమిటంటే,

    అర్జునుడు బ్రహ్మాస్త్రం ఉపసంహరించాక, కృష్ణుడి ద్వారా అశ్వత్థామ అదే అస్త్రం ప్రయోగించిన సంగతి తెలుసుకున్నాడు. తన వంశోద్ధారకుడు ఉన్న కన్యాకుబ్జం వైపు అది వెళ్తున్నట్టు తెలుసుకున్నాడు. అక్కడ ఉన్న బభ్రువాహనుని, ఉత్తరని సంరక్షించవలసినది గా ఆదేశించాడు. అసలే చాలా దుస్సాధ్యమైన పని కాబట్టి, దివ్య దృష్టి (video cameras అనుకోవచ్చు) తో బభ్రువాహనుని, మరియు ఉత్తరని చూస్తున్నాడు అర్జునుడు. చివరికి వారు రామాలయం చేరుకోవడం తో ఊపిరి పీల్చుకున్నాడు.

    ఆ మరునాడు, తిరిగి దివ్య దృష్టి తో చూస్తున్న అర్జునుడికి ఈ కింది దృశ్యాలు పొడగాట్టాయి.

-- 2 --

    బభ్రువాహనుడు మైకం లోంచి లేచాడు. ఎదురుగా ఉత్తర ఇంకా స్పృహతప్పి ఉంది. అల్లంత దూరాన ఒక శకటం తమ వైపుగా రావడం కనిపించింది అతనికి. "కృష్ణుడే పంపించి ఉంటాడు", అనుకున్నాడతను. "దేవుడా! బాధ భరించ లేకున్నాను, నన్ను ఎవరైనా చంపివేయండి! అయ్యో!", అతి బాధాకరమైన ఆర్తనాదం అతనికి వినిపించింది. వస్తున్న కన్నీళ్లను దిగమింగుకొని, తన విల్లంబులను సరి చేసుకున్నాడు. ఆ ధ్వని వచ్చే దిశగా బాణాన్ని సంధించి వదిలాడు. ఆ ఆర్తనాదం ఆగిపోయింది. కృష్ణుడి ఆజ్ఞ ప్రకారం ఎట్టి పరిస్థితులలోను ఆ ఆలయాన్ని దాటి నగరం దిశగా వెళ్ళరాదు, అందుకే కేవలం బాణాన్ని సంధించాడతాను. కాని ఇంకొంతసేపటికే, ఎన్నో వందల వేల గొంతుల ఆర్తనాదాలు వినిపించడం మొదలుపెట్టాయి. ఖిన్నుడయ్యాడు బభ్రువాహనుడు. ఈసారి వస్తున్న కన్నీళ్లను ఆపుకోవడం అతని వశం కాలేదు. 

    నగరం లో పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. రాజమందిరం తో సహా అనేక ఆకాశహర్మ్యాలు నేలమట్టం అయ్యాయి. అన్ని ఇళ్ళు, వాహనాలు, అంగళ్లు, గుళ్ళు గోపురాలు అన్నీ, కొన్ని వేల ఏళ్ళ క్రితం వదిలేసినట్టు శిధిలమయ్యాయి. అక్కడక్కడ శవాలు లెక్కపెట్టలేనంత పడి ఉన్నాయి. కొనఊపిరి తో అక్కడక్కడా ఉన్న వాళ్ళైతే, నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్ళ ఒళ్ళంతా బొబ్బలెక్కి, కదలటానికి వీల్లేకుండా ఉన్నారు. కొందరికి కళ్ళమీద బొబ్బలేక్కితే, కొందరికి కనుగుడ్డు పైన బొబ్బలు. కళ్ళు ముయ్యలేక, తెరవలేక ఉంది వాళ్ళ పరిస్థితి. కొందరికి నాలుక పైన బొబ్బలు, ఇంకొందరికి నాసికారంధ్రాలలో. శ్వాస తీసుకుంటే ప్రాణం పోయేలా ఉంది పాపం. కాని చాలామందికి ఇక్కడ, అక్కడ అని కాక మొత్తం ఒళ్ళంతా బొబ్బలెక్కాయి.

    అక్కడ radiation effect శవాలపైన కూడా ఉంది. ఎవరి మృతకళేబరం ఎక్కడ ఉందో చెప్పడం అసాధ్యం. కనీసం ఇంకో వారం రోజుల తరువాత కాని, ఆ ప్రాంతం లోకి ప్రాణి అన్నది అడుగుపెట్టడం ప్రమాదకరం. ఈ లోపు అనాధ శవాలు మురిగిపోవడం తప్ప, ఎవరు చేసేది ఏమిలేదు. ఆ ప్రాంతం లో blast జరిగిన తర్వాత చెట్లపైన, గుట్టలపైన వాలిన పక్షులు కూడా, ప్రస్తుతం ఆ radiation బారిన పడ్డాయి. కొన్ని తమ రెక్కలని కూడదీసుకోలేక పోతున్నాయి. కొన్నిటికి కళ్ళు పోయాయి. భయానకంగా ఉంది అక్కడ పరిస్థితి. 

-- 3 --

     ఇదంతా దివ్యదృష్టి తో చూస్తున్న అర్జునుడు ఒక్క సారి కళ్ళు తిప్పుకున్నాడు (కళ్ళ ముందు project అయ్యి వస్తున్నాయి ఈ దృశ్యాలన్నీ). ఏదో గుర్తుకి వచ్చినట్టు మరొక్కసారి నగరం వైపు దృష్టి సారించాడు. కృష్ణుడు పంపిన రధం రావడం, అందులోనికి స్ప్రుహలోనికి వచ్చిన ఉత్తరని బభ్రువాహనుడు ఎక్కించడం కనిపించాయి. నిర్లిప్తంగా దివ్యదృష్టిని ముగించాడు అతను. తన మనవడు, పాండవ వంశాంకురం బ్రతికాడన్నదానికన్నా, ఈ విలయం తాలూకు బాధే అతనికి ఎక్కువగా ఉంది. ఐతే, వర్తమానాన్ని ఒక పెద్ద చిలుక ద్వారా తన అన్నగారు, ధర్మరాజుకి పంపించాడు. 

    రధాన్ని ఎక్కిన తరువాత, కొంతసేపటికి ఉత్తరకి నొప్పులు మొదలయ్యాయి. కన్యాకుబ్జం నించి అవధకి వెళ్ళే దారిలోనే, ఒక చిన్న పల్లెటూళ్లో ప్రసవాన్ని చెయ్యవలసి వచ్చింది. ఐతే, పుట్టినవాడు మృతశిశువు. కన్యాకుబ్జం లోని పెనుగండమైన radiation తప్పించుకోగలిగారు కాని, blast తరువాత వచ్చిన వేడికి పాపం ఆ పసికందు నిలబడలేకపోయాడు. ఐతే "ఏమిచేస్తాం, ఎలా రాసిపెట్టివుంటే అలా జరుగుతుంది", అనుకున్నాడు బభ్రువాహనుడు. ఐతే ఉత్తరకి ఈ విషయ౦ ఎలా చెప్పాలో అతనికి అర్ధం కాలేదు.

    సరిగ్గా అదే సమయానికి శ్రీ కృష్ణుడు, దేవతల వైద్యుడిని అక్కడికి వెళ్ళమని పురమాయించాడు. ఒక Space Ship లో దిగిన ధన్వంతరి, ఆ సమయానికి అక్కడ ప్రత్యక్షం అయ్యిన (Tele Presence) శ్రీ కృష్ణుడు, దేవతల చికిత్సావిధానాలను ఉపయోగించి ఆ బాలుడిని పునరుజ్జీవింపచేసారు. కృష్ణుడి చేత పరీక్షింపబడిన వాడు కాబట్టి, అతడిని పరీక్షిత్తు అని అనడం జరిగింది. ఉత్తరకి ఈ విషయం ఎలా చెప్పాల్ల్రా అనుకుంటున్న బభ్రువాహనుడు, కాస్త స్థిమితపడ్డాడు. మొత్తానికి దుర్యోధనుడి పన్నాగం పారలేదు.

-- 4 -- 
     ఎట్టకేలకి యుద్ధం ముగిసింది. పైకి ఎంత గాంభీర్యంగా కనిపించినా, అందరికీ ఏదో ఒక వెలితి. తనకి విద్యనేర్పిన గురుదేవుల చిత్రపటాలకి ప్రణమిల్లినప్పుడల్లా, అర్జునుడి చేతులు వణికేవి. ద్రవుపదీ దేవిని కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడలేకపోతున్నాడు అర్జునుడు. ఎందుకో ఆమె చేసిన ప్రతిజ్ఞలూ, ఆమెకోసం తాము చేసిన ఆనలూ నచ్చటం లేదు అతనికి. భీముడు బాగానే ఉన్నట్టున్నాడు, ఎందుకో ఈ మధ్య సురాపానాన్ని ఎక్కువగా చేస్తున్నాడనిపిస్తోంది. నకుల సహదేవులు, ఎక్కువగా కనిపించడం లేదు. అన్నగారు, ధర్మరాజు కూడా బాగానే ఉన్నాడు. ఆ మధ్య ధర్మజుని మందిరం లోనికి ఒకసారి వెళ్ళాడు అర్జునుడు, అంతా ఇదివరకటి లాగానే ఉంది, పాచికల మంటపం మటుకు గట్టి తెరలు వేసిఉంది.

    ఈ మధ్యలో శ్రీ కృష్ణుడు విచ్చేయడం జరిగింది. ఆ సందర్భం గా తన తమ్ముళ్ళందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసాడు ధర్మరాజు. ఆ సందర్భంగా కృష్ణుడు, కలి ప్రవేశ౦ జరిగిన సందర్భంగా భూమి మీద దేవతల ప్రమేయం (involvement) తక్కువగా ఉంటుందని, తను కూడా భూమిని విడిచి వెళ్ళిపోతానని, విష్ణువులో ఐక్యం అయిపోతానని చెప్పడం జరిగింది. పాండవులు దేవపుత్రులైనందువల్ల, చాల కాలం బ్రతుకుతారని, అందువల్ల విషయలోలురు కాకుండా ముక్తికోసం మాత్రమే ప్రయత్నించమని కూడా ప్రవచించాడు కృష్ణుడు. ఆ మాట విన్న ధర్మరాజు, మామూలు మనుషుల్లాగ, కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవిస్తామని, ఆ పైన మోక్ష సాధన కోసమే ప్రయత్నిస్తామని మాట ఇచ్చాడు. కృష్ణుడికి వీడుకోలు పలికి, అందరూ తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు.

    ఎందరు మరచిపోయినా, మరచిపోయేందుకు ప్రయత్నించినా, అర్జునుడికి మాత్రం కన్యాకుబ్జానికి జరిగిన సంఘటన మరపురావడం లేదు. దానికి పరిష్కారాన్ని ఆలోచించాడు, అతడు. అందుకే ఒక రోజు, ఒక పదిమంది ఋషీవల్యులను పిలిపించాడు. వాళ్ళ సహాయంతో, అణ్వస్త్రాలకు విరుగుడు ఆలోచించాలనుకున్నాడు. ప్రపంచంలో ఏ ప్రదేశం కూడా, ఇక ముందెన్నడూ ఇటువంటి మహమ్మారి బారిన పడకూడదని అతని ఆశయం. మనుషులకు ఎప్పుడైనాసరే, కీడు చెయ్యగల లోహ/అణు/పరమాణు/plastic వస్తువులన్నింటినీ నశింపచెయ్యగల విరుగుడు కనిపెట్టమని వారిని ఆదేశించాడు. పర్యావరణ సమతుల్యతకి, ప్రాణి ప్రపంచమే (Through genetic engineering) సరైనదని దేవతలు చెప్పడం అతనికి గుర్తుంది.

     అనుకున్నట్టుగానే, ఋషులు 5 సంవత్సరాలు శ్రమించి, విరుగుడు తయారుచేసారు. అది ఒక Bacteria. దానిని ప్రాణి సంబంధితం (Organic) కాని వస్తువు దేనిపైన ఐనా వదిలితే, క్షణాలలో దానిని తిని, హాని కలుగజెయ్యని వాయురూపం లో విడిచిపెడుతుంది. చూసే కళ్ళకి అక్కడున్న వస్తువు క్షణాలలో మాయం అయ్యినట్టు అనిపిస్తుంది. ఐతే దానిని పర్యావరణం లోనికి వదిలేముందు, ఎక్కడైనా ఒక జనావాసం లేని ప్రదేశంలో పరీక్షించాలి (Field testing). అందుకే, దానికి ధాన్య కటకం నించి సముద్రంలో 180 యోజనాలు (సుమారు 3500 KM) దూరంలోఉన్న ఒక నిర్మానుష్యమైన దీవిని ఎంచుకున్నారు.

    ఆ bacteria నీటి temperature/తేమ లో మాత్రమే మనగలదు. ఐతే, ప్రాణి సంబంధితం కాని వస్తువు ఉన్నంత వరకూ భూమి పైన అయినా దానిని తిని జీవించగలదు. ఆ తరువాత మాత్రం నేల పైన జీవించలేదు. దీవి చుట్టూ నీటిలో ఒక మోస్తరు మందపాటి గొడుగు మాదిరిగా ఉంటుంది, అంతే. జాగ్రత్తగా దానిని తీసుకుని ఆ దీవి లోనికి ప్రవేశించారు, అర్జునుడితో పాటు మునులు, కొందరు పనివాళ్ళు. పరిస్థితులను చూసి, దానిని విడిచిపెట్టారు మునులు. వారి మాట మీద ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి, తరువాతి రోజు బయలుదేరడానికి నిశ్చయించారు. 

    ఐతే, విధి రాతని ఎవ్వరూ మార్చలేరు. ఆ రోజు అక్కడ చేసిన ప్రయోగం వికటించింది. చిన్న చిన్న పురుగులను తినే, ఒక చెట్టు (లక్షల సంవత్సరాల క్రితం ఉండేది, ఇప్పుడు అంతరించిపోయింది), మనుషులని తినేదిగా మారిపోయింది. దాని శాఖలనించి అతి కష్టం మీద బయటపడ్డారు మునులూ, పనివాళ్ళు. ఈ విషయం తెలుసుకొన్న అర్జునుడు, ఇంక ఈ ప్రయోగాలను ఆపు చెయ్యమని ఆదేశించాడు. మరునాడు తెల్లవారుతూనే, అక్కడినించి పయనమయ్యారు వాళ్ళు. 

    రోజులు గడిచాయి. నెలలు గడిచాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. అర్జునుడికి, ఇంకొకసారి ప్రయత్నించే వీలు చిక్కలేదు, ఈ లోపున అన్నగారు చెప్పినట్టు అశ్వమేధాలు, అన్ని చేస్తూనే వున్నాడు. ఇలా చూస్తుండగానే, అన్న గారు శ్రీ కృష్ణుడికి మాట ఇచ్చిన కాలం గడిచిపోయింది. చక్రవర్తి యుధిష్ఠిరుని ఆజ్ఞ మీద, అర్జునుడికి కూడా ఆయనని అనుసరించి మహాప్రస్తానం సాగించక తప్పలేదు. ఏమి చేస్తాం, కోరికలు తీరకపోతే మరుజన్మ ఉంటుందని, ఉండాలని తెలుసు, మోక్షసాధన యందు మనసు లగ్నం కాదని తెలుసు, కాని దేవతలకు ఇచ్చిన మాట తప్పడం ఇష్టం లేదు. అంతా ఆ కృష్ణ పరమాత్ముడే చూసుకుంటాడు.

-- (సశేషం) -- 

4 comments:

  1. సలాహుద్దీన్,

    చాలా గొప్పగా రాస్తున్నారు. మీకు తెలుగుమీద ఇంత పట్టు వుండటం చాలా గొప్ప విషయం. అందులోనూ హిందూ పురాణాల మీద. అభినందనీయులు.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. సలాహుద్దీన్ నా కలం పేరు. ఒక సినిమాలో అటువంటి పాత్రని చూసి పెట్టుకున్నది. మీరిచ్చిన ప్రశంస కి థాంక్స్.

    ReplyDelete
  4. చాలా అరుదుగా ఈ బ్లాగు దొరకుతుంది, కానీ మీరు స్పష్టమైన తెలుగు భాష వ్యక్తులు లా అనుకుంటున్నాను. మీరు ఈ బ్లాగ్ లో బాగా రాశారు హిందూ పురాణా చరిత్రలు గురించి. తెలుగు భాష మీద మీ ఆసక్తికి ధన్యవాదాలు.
    Reshma M,
    Bus Ticket booking online is just a click Away!

    ReplyDelete